ఒంగోలు పరిశుభ్రతపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి – పారిశుధ్య నిర్వహణ మరింత బలోపేతం చేయాలని ఆదేశాలు
ఒంగోలు నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు శుభ్రమైన వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని కొత్త మామిడిపాలెం విండ్రో కంపోస్టింగ్ యూనిట్, చెత్త సంపద కేంద్రం, గాంధీ పార్క్, ఊట చెరువు ప్రాంతం, సులభ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా సేంద్రీయ వ్యర్థాలను ఎరువుగా మార్చే విధానాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. చెత్త సంపద కేంద్రాలను పటిష్టంగా నిర్వహించి నగర పరిశుభ్రతను మెరుగుపరచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
గాంధీ పార్క్లో నిర్మాణంలో ఉన్న వాకింగ్ ట్రాక్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, మున్సిపల్ ఖాళీ స్థలాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఊట చెరువు ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, నగర పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో ఒంగోలు మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ ఐషయ్య, ఎంహెచ్ఓ వైష్ణవి తదితర అధికారులు పాల్గొన్నారు.