5 తరాలకు సలహాలు ఇస్తున్న శతాధిక వృద్ధురాలు వెంకట సుబ్బమ్మ
దొనకొండ మండలం రామాపురం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు గొంగటి వెంకట సుబ్బమ్మను కపురం శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెతో కొంతసేపు ముచ్చటించి, వారి దీర్ఘాయుష్షుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
వెంకట సుబ్బమ్మ మాట్లాడుతూ, పల్లెటూరి స్వచ్ఛమైన వాతావరణం, సహజ ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమే తన ఆరోగ్యానికి ప్రధాన కారణమని తెలిపారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి కూడా తనపై ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. పట్టణ జీవనశైలి, మానసిక ఒత్తిళ్లు, అనారోగ్యకర ఆహార అలవాట్ల వల్ల యువత చిన్న వయసులోనే అనారోగ్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
40 మంది రక్తసంబంధీకులతో, ఐదు తరాల మనవళ్లు–మునిమనవరాళ్లతో కలిసి జీవించడం దేవుడిచ్చిన వరమని, ఈ వయసులోనూ సరదాగా, సంతోషంగా జీవిస్తున్నానని చెప్పారు.
ఈ సందర్భంగా కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, వెంకట సుబ్బమ్మ జీవన విధానం నేటి తరాలకు గొప్ప ఆదర్శమని పేర్కొన్నారు. పల్లె జీవన విలువలు, ఆరోగ్యకరమైన అలవాట్లపై యువత దృష్టి పెట్టాలని సూచించారు.